30, ఆగస్టు 2012, గురువారం

మానని గాయం గుజరాత్...


http://www.gujaratplus.com/riots_gal/childbig.jpg
గోధ్రా రైలు దుర్ఘటన తరువాత రోజు నుండి వరుసగా వారం దినాలకు పైగా గుజరాత్ ముస్లింలపై జరిగిన దారుణ మాన ప్రాణ ఆస్తి హనన కాండపై ప్రత్యేక కోర్టు నిన్న వెలువరించిన తీర్పు ఆహ్వానిద్దాం. వీరికి రేపు శిక్షలు ప్రకటించే అవకాశముంది. ఇదంతా వార్తా పత్రికలలో చదివిన విషయమే. అక్కడే ఇంకో విషయముంది. ఈ మొత్తం మారణ కాండకు నేతృత్వం వహించిన అప్పుడు ఇప్పుడు వున్న సి.ఎం. ఈ మారణకాండకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ప్రకటించడం. అంటే దీనికి తానే పూర్తి బాధ్యత వహించినట్టు భావిద్దామా? అటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి అధికారంలో వున్న వాడిపై చర్య తీసుకునే క్రమంలో లేదన్నది స్పష్టమౌతున్నది. ఓటు బ్యాంకు రాజకీయాలు నడపడంలో రెండు పార్టీలు దొందూ దొందె. రెండు వేలమందికి పైగా ఈ దేశ ప్రజలు ఊచకోతకు గురి కాబడితే ఏళ్ళ తరబడి దర్యాప్తుల పేరుతో కాలం గడుపుతూ మానని గాయంపై కారం చల్లే ప్రక్రియ జరుగుతోంది. కడుపులో శూలాలు దించి గర్భస్థ శిశువులను బయటకు లాగిన ఉన్మాదులొక్కరూ శిక్షింపబడకపోవడం ఈ దేశ ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థ యొక్క దుర్నీతిని తెలియజేస్తోంది. భయపెట్టి, ప్రలోభ పెట్టి బాధితులను సాక్షులను తారు మారు చేసి ఒక ఎం.పీ.కుటుంబం మొత్తం తగలబెట్టిన కేసునే తగలబెట్టిన న్యాయం మనది. యిలా రోజు రోజుకి దిగజారిపోతున్న అధికార న్యాయ వ్యవస్థలు బాధితులకు న్యాయం చేస్తాయన్నది మృగ తృష్ణ కాదా?

మీడియాలో ఓ దోషిని తీసుకు వెళ్తుండగా వాడి పిల్ల ఏడుస్తున్న ఫోటో వేసి సానుభూతి పొందే అవకాశాన్నిస్తున్నారు. అంటే కేసు పట్ల మీడియ వైఖరి కూడా తెలుస్తోంది. అటువంటి ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు, అలాగే వారి తల్లి దండ్రులు వారి కళ్ళముందే ఈ దారుణ మారణకాండలో హత్య చేయబడ్డారు? దానినుండి మానసికంగా దూరం చేయడానికి జరిగే కుట్రకాదా? ఇక్కడ మీడియా కూడా హైందవ ఫాసిస్ట్ వర్గ కార్పొరేట్ చేతుల్లో వుందన్నది సుస్పష్టం.